తెలంగాణలో గత ప్రభుత్వం సేకరించిన ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీగా మార్చడంపై వివాదం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 19,333 ఎకరాలను ఒక నిర్దిష్ట 'ప్రజా ప్రయోజనం' (ఔషధ రంగం) కోసం సేకరించారు. అయితే ప్రాజెక్టు మార్పుతో.. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 101 ప్రకారం ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉద్దేశించిన ప్రాజెక్టును రద్దు చేసి, భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టవిరుద్ధమని రైతులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. పారిశ్రామిక హబ్ నుండి రియల్ ఎస్టేట్ తరహా ప్రాజెక్టుగా మార్చడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.