ఎవరైనా 4, 5 ఏళ్ల వయసులోనే స్కూలుకు వెళ్లడం ప్రారంభిస్తారు. కానీ అతడు మాత్రం 14 ఏళ్లు వచ్చే వరకు కూడా బడి బాట పట్టలేదు. చెప్పేవారు ఉన్నా.. బడికి వెళ్లి చదువుకునే స్థోమత లేకపోవడంతో అతడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేస్తూ.. పశువుల కాపరిగా మారాడు. కానీ చదువుకోవాలనే సంకల్పాన్ని మాత్రం విడవలేదు. చివరికి 14 ఏళ్ల వయసులో నేరుగా ఏడో తరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభుత్వ హాస్టల్లు, ప్రభుత్వ స్కాలర్షిప్లతో చదివి.. ప్రస్తుతం పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడు. అతడే డాక్టర్ పరమేష్.