తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టుతో ఆమనగల్లు ప్రాంతానికి పూర్వ వైభవం రాబోతోంది. 2016 జిల్లాల విభజన తర్వాత ప్రాధాన్యత కోల్పోయిన ఈ ప్రాంతం.. ఇప్పుడు నూతన పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో మళ్లీ పరిపాలనా కేంద్రంగా మారుతోంది. ఆమనగల్లును ఏసీపీ (ACP) కేంద్రంగా ప్రకటించి.. దీని పరిధిలోకి ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల పోలీస్ స్టేషన్లను చేర్చారు. ఈ నిర్ణయంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగి.. వ్యాపార కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. పోలీస్ కార్యాలయాలతో పాటు ఆర్డీవో (RDO), ఆర్టీవో (RTO) ఆఫీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఆమనగల్లు ఒక కీలకమైన హబ్గా అవతరించబోతోంది.