తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇరుకు స్థలాలు ఉన్నవారికి గ్రౌండ్ ప్లస్ వన్ (జి ప్లస్ 1) పద్ధతిలో ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తూ జీవో 69 విడుదల చేసింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఈ పథకం కింద స్థలం ఉన్న వారికి దశల వారీగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, కనీసం 323 చదరపు అడుగుల (323 Sq. Ft) కార్పెట్ ఏరియా ఉండాలని నిబంధన విధించారు.