సంక్రాంతి పండుగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడకాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాణాంతక దారం వల్ల పక్షులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే.. చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుంచి ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని, ప్రాణాలను కాపాడేందుకు ఎమ్మెల్యే తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.