ఏపీలో మరో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కర్నూలు జిల్లా మునగలపాడు గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంత్రి టీజీ భరత్, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి మునగలపాడు క్రికెట్ గ్రౌండ్ శనివారం పరిశీలించారు. క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు వీలైనంత త్వరగా ప్రణాళిక రూపొందించాలని ఏసీఏ ప్రతినిధులను ఆదేశించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీజీ భరత్ తెలిపారు.