వైఎస్సార్ కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో కన్న బిడ్డల కళ్లెదుటే ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన కడప శివారు ప్రాంతమైన చలమారెడ్డిపల్లెలో జరిగింది. పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లెకి చెందిన కిరణ్ కుమార్.. ఆరేళ్ల కిందట మంజులను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే కిరణ్ కుమార్.. కుటుంబ పోషణ భారంగా మారటంతో ఇటీవల తన స్కూటీని తాకట్టు పెట్టారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. భర్త తన మాట వినలేదని.. మంజుల పిల్లల ఎదుటే ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.