తెలంగాణలో వర్షాకాల సీజన్ కీలక దశలో వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 22.5 శాతం వర్షపాతం లోటు నమోదైంది. 20 జిల్లాల్లోని 376 మండలాల్లో పరిస్థితి ప్రతికూలంగా ఉంది. సాధారణ సాగు విస్తీర్ణంలో 92.69 శాతం మాత్రమే పంటలు వేశారు. ప్రధాన పంట వరి 81.7 శాతానికే పరిమితమైంది. పలు ప్రాంతాల్లో నాట్లు ఎండిపోతున్నాయి. పత్తి, ఇతర పంటలు కాత, పూత దశలో ఉన్నాయి. పంటలను కాపాడాలంటే రెండు మూడు భారీ వర్షాలతో పాటు వారం రోజుల సాధారణ వర్షాలు అవసరమని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు.