హైదరాబాద్ నగర శివారులోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు తరహాలో అధునాతన ఎకో పార్కు ఏర్పాటుకు అటవీశాఖ పనులు ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్న అటవీ భూమిలో 142 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్ల వ్యయంతో ఈ పార్కును నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సైక్లింగ్ ట్రాక్లు, వాక్వేలు, ధ్యానమందిరాలతో పాటు సందర్శకుల రద్దీ నియంత్రణకు ఐదు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు.