వైఎస్ఆర్ కడప జిల్లా గండి వీరాంజనేయస్వామి ఆలయంలోని అర్చకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు హారతి పళ్లెంలో సమర్పించే డబ్బులను.. హుండీలో వేయడానికి ప్రధాన అర్చకుడు అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ భక్తుడు గండి ఆంజనేయస్వామి గుడిని సందర్శించారు. రూ.500 పెట్టి ఆకుపూజ టికెట్ కొనుగోలు చేశారు. అయితే టికెట్ కొనుగోలు చేసినప్పటికీ అర్చన సమయంలో అదనంగా రూ.200 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేశారని.. అదనంగా ఇస్తేనే పూజ చేస్తామని చెప్పినట్లు భక్తుడు వాపోయాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో గండి ఆలయంలో అర్చకుల తీరు వెలుగులోకి వచ్చింది.