పెద్దపల్లి జిల్లా ప్రజలకు తిరుపతి వెళ్లేందుకు కరీంనగర్ తిరుపతి బై-వీక్లీ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల ఆ ట్రైన్ హాల్టింగ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపివేశారు. కారణాలు ఏమైనప్పటికీ.. ఈ నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో తిరుపతికి వెళ్లేందుకు సమయం, ఖర్చు రెండూ పెరగడంతో ప్రజలు తమ సమస్యను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడటంతో సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఎప్పటిలాగే రైలు హాల్టింగ్ సౌకర్యం పునరుద్ధరించబడింది.