తిరుమలలో వరుస కుంభకోణాలు భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తిరుమల పరకామణి చోరీ, శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి దుమారం కొనసాగుతుండగానే.. తిరుమల సన్నిధిలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మల్బరీ పట్టు శాలువాలకు బదులుగా.. 100 శాతం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ ఆరోపించింది. 2015 నుంచి 2025 వరకు ఈ మోసం జరిగిందని పేర్కొంది. అధిక ధరలకు నాసిరకం వస్తువులు కొనుగోలు చేశారని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. దీనిపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.