తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. గతంలో జరిగిన విభజన అశాస్త్రీయమని మంత్రి అనడంతో.. హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదనే 'పీవీ నరసింహారావు జిల్లా'గా ఏర్పాటు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పరిపాలన ప్రజలకు దగ్గరవ్వాలంటే హుజూరాబాద్ జిల్లా కేంద్రం కావడం అవసరమని నాయకులు స్పష్టం చేశారు. మంత్రి హామీ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.