తెలంగాణలో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన అడ్డంకిగా మారిన అఫిడవిట్ నిబంధనను ప్రభుత్వం తొలగించనుంది. దశాబ్దాల క్రితం భూమి అమ్మిన వారు ఇప్పుడు సంతకాలు చేసేందుకు నిరాకరిస్తుండటంతో 9 లక్షల దరఖాస్తులు నిలిచిపోయాయి. దీనిని గమనించిన సర్కార్.. ఇకపై క్షేత్రస్థాయిలో పొషెషన్ (భూమి ఎవరి ఆధీనంలో ఉంది), ఇరుగుపొరుగు రైతుల సాక్ష్యాల (పంచనామా) ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలతో ఒకటి రెండు రోజుల్లో కొత్త జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.