శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గతేడాది తొక్కిసలాట ప్రమాదం తర్వాత మరమ్మతుల కోసం మూసివేసిన ఈ దేవాలయంలో, దుండగులు వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి చెందిన 9 తులాల బంగారు ఆభరణాలు, 11 కిలోల వెండి వస్తువులతో పాటు హుండీలోని నగదును దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దొంగలు సీసీటీవీ డీవీఆర్ను కూడా తీసుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమతులు లేని ప్రైవేటు ఆలయం కావడంతో భద్రతా లోపాలపై విమర్శలు వస్తున్నాయి.