ఇండియాలో ఉంటూ పాకిస్థాన్కు చెందిన టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు కలిగిన ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ధర్మవరంలో అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరుడు కొత్వాల్ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో ధర్మవరం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ అలాం షేక్ ఇస్లాం, ఉత్తర్ప్రదేశ్కు చెందిన సజ్జద్ హుస్సేన్ను అరెస్ట్ చేసి ధర్మవరం తీసుకొచ్చారు. వీరిద్దరికీ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో సంబంధాలున్నాయని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకి వెల్లడించారు. వీరి ఫోన్లను సీజ్ చేశామని.. సజ్జద్ హుస్సేన్ అనే నిందితుడు పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీడియో కాల్స్ మాట్లాడిన ఆధారాలు దొరికాయన్నారు. అలాగే, సజ్జద్ హుస్సేన్ దగ్గర నుంచి సింగిల్ బ్యారెల్ గన్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులిద్దరినీ కోర్టులు హాజరుపరిచి రిమాండ్ కోరతామని వెల్లడించారు.