మూసీ ప్రక్షాళన తాము మొదలుపెట్టినదేనని.. దానికి తాము అడ్డుకాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. అయితే.. చర్చా సమయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా జనవరి 3వ తేదీన జరిగే సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ హాజరుకాకూడదని నిర్ణయించారు. గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా మాట్లాడుతున్నారని.. స్పీకర్ ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 'ఆర్ఆర్ టాక్స్' వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ సభను బహిష్కరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.