ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్లాస్టిక్ నిషేధంపై కొనసాగుతున్న చర్చలో మాట్లాడారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయాలంటే రూ.కోట్ల ఖర్చవుతుంది. సంబంధిత శాఖ మంత్రిగా, హీరోగా మీరే అలా కాలర్ ఎగురవేసి ఒక్క పిలుపిస్తే.. మీ జనసైనికులే నియంత్రణకు నడుం బిగిస్తారు. ఎవరైనా ప్లాస్టిక్ను పడేసినా.. పట్టుకుంటారు’ అని చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పడిపడి నవ్వారు. సభలో సభ్యులందరి మధ్య నవ్వులు విరిశాయి.