ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అశ్వారావుపేట కిసాన్ మేళాలో ఆయన వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. గతంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకం ద్వారా రూ.1.07 కోట్ల విలువైన పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు. పామాయిల్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలని.. అందులో అంతర పంటల ద్వారా అదనపు లాభాలు పొందాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు కాలువలను పూర్తి చేసి దమ్మపేట, అశ్వారావుపేటలకు నీరందిస్తామన్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుతాయి.