హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు కోసం చౌటుప్పల్ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. వ్యవసాయ భూముల రైతులను అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తుండగా.. వెంచర్లలోని ప్లాట్ల యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. తాళ్లసింగారం, చౌటుప్పల్ పరిధిలోని 15.59 ఎకరాల వెంచర్ భూమిని సేకరించాల్సి ఉంది. సుమారు 300 ప్లాట్లలో ఇప్పటివరకు 30 మంది యజమానులే గుర్తించారు. పలువురు స్థానికేతరులు కావడం, ఎల్ఆర్ఎస్ వివరాలు లేకపోవడం సమస్యకు కారణమవుతోంది.