హైదరాబాద్ నగర పాలనలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా 'కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు–2026' ముసాయిదాను విడుదల చేసింది. ఆధునిక పట్టణ పాలన, డిజిటల్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, వ్యాపార సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ బిల్లుపై జూలై 24 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.