అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల నుంచి 3ఏ ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు చేరాయి. సోమవారం నాటికి కృష్ణా జిల్లా నుంచి కూడా ప్రతిపాదనలు అందనున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏలూరు, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ వెళ్లే గ్రామాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లా నుంచి ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయి. ఒకట్రెండు రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా నుంచి కూడా ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థకు చేరనున్నాయి. ఆ తర్వాత కొన్ని దశల అనంతరం భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.