నడిచే వారి కోసం నిర్మించిన ఫుట్పాత్లను ఆక్రమించి.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆరాంఘర్ జంక్షన్ (రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి) వద్ద భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై స్థానికులు, ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో.. రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కూల్చివేతలను కొందరు వీధి వ్యాపారులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టి, నడిచేవారి దారులను ఆక్రమణల నుంచి విముక్తి కల్పించారు.