హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు వీఐపీ ఇళ్లలోనూ ఈజీగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా.. సనత్ నగర్ జెడ్ కాలనీలోని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి పక్కా ప్రణాళికతో చొరబడిన దొంగలు సుమారు రూ. కోటిన్నర విలువైన నగదు, ఇతర సొత్తును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.