టీడీపీ కార్యకర్తలకు ప్రమాదబీమా మరింత పెంచుతున్నామని, కార్యకర్తలు అలకలను మానాలని మంత్రి లోకేష్ తెలిపారు. యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సోమవారం (మార్చి 31న) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ .. కార్యకర్తలు చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతున్నారని, చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని అలగడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు అలకలకు వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని కోరారు. మొన్నటి ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చామని, మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. చిన్న కుటుంబంలోనే గొడవలు ఉంటాయని, ఇంత పెద్ద పార్టీలో ఉండవా.. అని చెప్పారు. కార్యకర్తల సమస్యలు పరిష్కారం కాకుంటే ఇంఛార్జి మంత్రులను కలవాలని సూచించారు. గ్రామంలోని చిన్న సమస్యలు కూడా తనకు తీసుకొచ్చి ఇస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో తెలుగువాళ్లు నెంబర్వన్గా ఉండాలనేదే తమ లక్ష్యం అని లోకేష్ ప్రసంగించారు.