పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల.. ఉగ్రవాద బాధిత కుటుంబాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మధుసూదన్ కుటుంబం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎత్తితే ఉగ్రవాదులు వణికిపోతారనే నమ్మకం తనకు కలిగిందని మధుసూదన్ కుమారుడు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే ఆపరేషన్ సిందూర్ వార్తలు చూశానని.. ఆపరేషన్ సిందూర్తో మన దేశంలో ఇంకో ఉగ్రదాడి జరగదని అనుకుంటున్నానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ మోడీ బిగినింగ్ స్టెప్ మాత్రమేనని అన్నారు.