విశాఖ జిల్లా పెందుర్తిలో ఘరానా దొంగ వ్యవహారం బయటపడింది. ఓ వ్యక్తి తన బైక్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయం ఒకటి తెలిసింది. అసలు ఈ బైక్ దొంగతనం చేసిన దొంగ.. మాములు దొంగ కాదు గజ దొంగ అని అర్థమైంది. ఇంటి వద్ద ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని పెందుర్తి రాతి చెరువు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన క్రైం టీం పోలీసులకు ఓ ఆశ్చర్యకరమైన దొంగతనాల స్టోరీ కంటపడింది. పెందుర్తి J.N.N.U.R.M కాలనీకి చెందిన అంపోలు కిశోర్కుమార్ అలియాస్ ధోనభాయ్ అనే వ్యక్తి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక అతడి కోసం మాటు వేసి పక్కా ఆధారాలతో ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడు కిశోర్కుమార్ విశాఖలోని పెందుర్తి, టూటౌన్, గోపాలపట్నం, ద్వారకా, కంచరపాలెం, ఆనందపురం, విజయనగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో దాదాపు 20కిపైగా బైకులు చోరీ చేశాడని పోలీసులు తెలిపారు.