పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న(మంగళవారం) ఖమ్మం జిల్లా కారేపల్లిలో 7.0 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాల కారణంగా రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.