తిరుమల శ్రీవారికి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా భారీ విరాళం అందజేశారు. శ్రీవారికి 5 కేజీల బంగారంతో కటి హస్తం, వరద హస్తాలు సమర్పించారు. స్వామివారికి సమర్పించిన ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుటుంబసమేతంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న గోయెంకా.. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాల అందజేశారు. సంజీవ్ గోయెంకాకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్న సంజీవ్ గోయెంకా.. స్వామివారికి ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దివ్య దర్శనం కలగడం, స్వయంగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప సందర్భమన్నారు.