తిరుమలలో బాలుడి మరణ వార్తలపై టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో తొక్కిసలాట జరిగి బాలుడు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. అవాస్తవ వార్తలను ఖండించింది. ఆ బాలుడు ఆరేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడన్న టీటీడీ.. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం అన్నదాన కేంద్రంలో భోజనం చేసి బయటకు వస్తూ అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లు తెలిపింది. వెంటనే అశ్వినీ ఆస్పత్రికి తరలించామని, అక్కడి డాక్టర్ల సూచన మేరకు తిరుపతి స్విమ్స్కు తరలించినట్లు తెలిపింది. స్విమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు పేర్కొంది. టీటీడీపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.