కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఆయనకు సలహా ఇచ్చినట్లు ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. తన సూచనను జగన్ పట్టించుకోదని అన్నారు. తప్పు చేస్తే జగన్ పై కేసు పెట్టాలే కానీ, అధికారులను ఇబ్బంది పెట్టకూడదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు వెళ్లారని.. తాను ములాఖత్ లో ఆయనను పరామర్శించానని వెల్లడించారు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని అన్నారు. తనకు అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో స్నేహం ఉందని తెలిపారు. జగన్ తప్పు చేస్తే ఆయనపై కేసు నమోదు చేయాలని... అధికారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని ఉండవల్లి అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ మద్దతు ఇవ్వాలని సూచించారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్కు లేదని, యుద్ధం వస్తే పాకిస్థానే ఎక్కువగా నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. మతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, భారతదేశంలో 12 శాతం ముస్లింలు ఉంటే, పాకిస్థాన్లో హిందువులు ఒక శాతం మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. అందరూ పాకిస్థాన్ చర్యలను వ్యతిరేకించాలని చెప్పారు.