మాజీ మంత్రి , వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని ఎద్దేవా చేశారు. అప్పట్లో అమిత్ షా తిరుమలకు వస్తే రాళ్లు వేయించారన్న అంబటి రాంబాబు.. ఇప్పుడు రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి విందులు ఏంటోనంటూ మండిపడ్డారు. ఇక చంద్రబాబుతో అమిత్షా ఏం మాట్లాడారో తమకు సమాచారం ఉందని అంబటి అన్నారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అడిగితే.. నారా లోకేష్ను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్ షా చెప్పారని అంబటి ఎద్దేవా చేశారు. నారా లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని అమిత్ షా అన్నట్లు అంబటి చెప్పుకొచ్చారు. ఈ విషయాలు బయటకు రాకుండా ఏవేవో కథలు చెప్తున్నారని మండిపడ్డారు.