గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు పేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయనే ఆరోపణలను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖండించారు. కొందరు రాజకీయ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో పేదల ఇళ్లను హైడ్రా కూల్చదని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి సంపన్నులు, రాజకీయ నాయకుల అక్రమ నిర్మాణాలను మాత్రం వదిలేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటివరకు 500 ఎకరాలకు పైగా భూములను ఆక్రమణల నుండి విముక్తం చేశామని, 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.