హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్, వరంగల్, నల్గొండ సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గత నెలలో ఒక ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటూ వెంకట్రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆస్తులపై నిఘా పెట్టిన అధికారులు.. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు, బంగారం, నగదు మరియు కీలక పత్రాలను గుర్తించారు. తహసీల్దార్ స్థాయి నుంచి అదనపు కలెక్టర్ వరకు ఆయన సంపాదించిన బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది.