ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఒక్కసారిగా పుంజుకోవడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ. 4,000 వరకు పెరగడం విశేషం. బుధవారం జరిగిన వేలంలో తేజా రకం మిర్చి గరిష్టంగా రూ. 20,000 ధర పలికింది. ఈ సీజన్లో క్వింటాలుకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. సాగు విస్తీర్ణం తగ్గడం, నల్ల తామర పురుగు దాడి వల్ల దిగుబడి తగ్గుతుందన్న అంచనాలతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. గతంలో రూ. 14,000 లోపే ధర ఉండటంతో నష్టపోయిన రైతులు, ఇప్పుడు పెరుగుతున్న ధరలతో ఊరట చెందుతున్నారు.