ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాతో పాటు తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో పంట పొలాల వైపు వస్తున్న ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగులు రెండు గుంపులు విడిపోయి మరీ గ్రామాల వైపు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోందని, మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.