తెలంగాణలో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. తాజాగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ తన భార్య ప్రసవం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని ఎంచుకున్నారు. గర్భధారణలో కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. గౌతమ్ గతంలో ఖమ్మం కలెక్టరుగా ఉన్నప్పుడు కూడా తన మొదటి సంతానం కోసం ప్రభుత్వ దవాఖానానే ఆశ్రయించారు. వీరితో పాటు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, భద్రాద్రి కలెక్టర్ జితేష్ పాటిల్ వంటి యువ అధికారులు సైతం తమ కుటుంబ సభ్యుల వైద్యం కోసం సర్కారు ఆసుపత్రులనే ఎంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.