కరీంనగర్ రాజకీయాల్లో చిచ్చు రాజేసిన ఆడియో.. రసమయి వర్సెస్ కవ్వంపల్లి

4 months ago 8
కరీంనగర్ జిల్లా మానకొండూర్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుకుంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల మధ్య మాటల యుద్ధం పరిస్థితిని తీవ్రం చేస్తోంది. గతంలో సమావేశాలు, కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకునేవారు. ఇప్పుడు ఆడియోలు వైరల్‌ కావడం.. కేసు వరకు వెళ్లడం.. రెండు పార్టీల శ్రేణులు ఆందోళనలకు దిగడంతో పరిస్థితి తీవ్రమయింది. బెజ్జంకి మండలంలోని రసమయి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కవ్వంపల్లి, రసమయి ఒకరినొకరు దుర్భాషలాడినట్లు ఉన్న ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇందులో వ్యక్తిగత విమర్శలు, ఒకరిపై ఒకరు బూతులతో తిట్టుకోవడం ఉండడం చర్చనీయాంశంగా మారింది. రసమయి బాలకిషన్ తనపై చేస్తోన్న విమర్శలను స్థానిక విలేకరులు వార్తాపత్రికల్లో రాస్తుండడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లికి కోపం వచ్చింది. నిరాధారమైన బాలకిషన్ ఆరోపణలను గుడ్డిగా ఎలా రాసేస్తారని విలేకరులను తన ఇంటికి పిలుపించుకుని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ క్రమంలో రసమయి బాలకిషన్‌ను ఉద్దేశించి బూతులు తిట్టారు. ఈ ఆడియో తన వద్దకు వచ్చిందని.. దాన్ని తిరిగి కవ్వంపల్లి సత్యనారాయణకు పంపానని బాలకిషన్ చెబుతున్నారు. ఆ తర్వాత కవ్వంపల్లిని బూతులు తిడుతూ ఒక ఆడియోను ఆయనకే బాలకిషన్ స్వయంగా పంపారు. దీంతో కవ్వంపల్లి అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలకిషన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. గతంలో విలేకరుల సమావేశాల్లోనూ బాలకిషన్, కవ్వంపల్లి ఒకరిపై ఒకరు పరుష పదజాలం ఉపయోగించి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ సారి పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో పరిస్థితి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తనను దూషిస్తూ ఆడియోను తన ఫోన్‌కి పంపారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. ఎల్‌ఎండీ పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. కేసులకు తాను భయపడనని.. ముందుగా తనను దుర్భాషలాడిన కవ్వంపల్లిపై కేసు పెట్టాలని బాలకిషన్ అంటున్నారు. మొదట తనని తిట్టాడనే ఉద్దేశంతోనే తాను ఆడియోను ఎమ్మెల్యేకు పంపానని.. తనపై అకారణంగా కేసు నమోదు చేశారని.. పూర్తి ఆధారాలతో పోలీసులకు తాను కూడా ఫిర్యాదు చేస్తానని అమెరికాలో ఉన్న రసమయి బాలకిషన్ ఓ వీడియోను విడుదల చేశారు.
Read Entire Article