కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ప్రత్యేక గుర్తింపు పొందింది. 2014 నుంచి 2023 మధ్యలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు భూమి విస్తీర్ణం.. ప్రస్తుతం 2.21 కోట్ల ఎకరాలకు చేరుకోవడం గమనార్హం. కేవలం తొమ్మిదేళ్లలోనే దాదాపు కోటి ఎకరాల అదనపు భూమి సాగులోకి రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలు భూగర్భ జలమట్టాన్ని పెంచి, బీడు భూములను సైతం పచ్చని పొలాలుగా మార్చాయి.