హైదరాబాద్ కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చెట్లను నరకటంపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు సెలవులను ఆసరాగా చేసుకుని రాత్రి వేళల్లో అధికారులు చెట్లను కొట్టేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదించగా.. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జూలై 27న తదుపరి విచారణ జరగనుండగా.. అప్పటివరకు చెట్ల నరికివేతను పూర్తిగా నిషేధించింది. దీంతో కొత్త ఫ్లైఓవర్ పనులకు బ్రేక్ పడినట్లయింది.