గుప్త నిధుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, పూజలు నిర్వహించిన తర్వాత బొగ్గు బంగారంగా మారుతుందని చెప్పి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. ముందుగానే సిద్ధం చేసుకున్న నకిలీ బంగారు నాణేలు, బొగ్గు, మట్టిని గుంతల్లో పెట్టి బాధితులను మోసం చేసేవారు. ఇప్పటివరకు సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.