చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలైందని, అధికార దాహంతో ప్రజలను మోసం చేయడమే ఆయన రాజకీయ విధానమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీ 19 వార్డులు గెలిచినా, చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించి మున్సిపల్ చైర్మన్ పదవిని బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. కుప్పం మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది.. అక్కడి ప్రజలకు తాగునీరు అందించింది తమ ప్రభుత్వమేనని అని గుర్తు చేశారు. విశాఖపట్నంలో చంద్రబాబు తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, జుడిషియల్ ప్రివ్యూలను రద్దు చేసి, కాంట్రాక్టర్లకు మేలు చేశారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా, తన సొంత నియోజకవర్గంలోనే అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.