హైదరాబాద్లోని పాతబస్తీ, మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది కన్నుమూశారు. ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం మరణాల సంఖ్య 17కు చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 30 మంది ఉండగా, 17 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్మార్టం చేసిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. చనిపోయిన వారు చాలా మంది గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.