తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. రూ.300 ప్రత్యేక దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులను నిర్దేశిత సమయానికే దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. దర్శనం కోసం ముందుగా వచ్చి ఇబ్బందులు పడవద్దని.. అలాగే మిగతా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని ఓ ప్రకటనలో కోరింది. శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోమవారం నుంచి కఠినంగా అమలుచేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.