తెలంగాణలో ఐదు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం నల్గొండ జిల్లా ముల్కచర్లలో 10.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇటీవల హైదరాబాద్లో వర్షాలతో రోడ్లు జలమయమై, తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు.