ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే క్యాట్ఫిష్ పెంపకంపై ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ వనపర్తి జిల్లాలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒక్క పెబ్బేరు మండలంలోనే 30కి పైగా అక్రమ చెరువులు వెలిసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వీటికి కుళ్లిన చికెన్ వేస్టేజీని ఆహారంగా వేస్తుండటంతో చుట్టుపక్కల పొలాలు దుర్వాసనతో నిండిపోతున్నాయి. తక్కువ ఖర్చుతో కోట్లు సంపాదించవచ్చుననే ఆశతో ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు ఇక్కడ చేపలను పెంచి విజయవాడ, వైజాగ్, బెంగళూరులకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.