తెలంగాణలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్టంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, మే మొదటి వారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.