సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి.. పోసాని కృష్ణమురళీకి మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. అయితే, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నరసరావుపేట సబ్ జైల్లో కాకుండా గుంటూరు జిల్లా జైలులో తనకు రిమాండ్ విధించాలని పోసాని కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి.. గుంటూరు జైలు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదయ్యాయి.