నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ పరిధిలోని మహంకాళి గుడిలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దొంగలు ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును కాజేసి, ఖాళీ హుండీని వ్యాసగుడి వద్ద పడేశారు. మంగళవారం ఉదయం అర్చకులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్ టీమ్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.