భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.26 గంటల సమయంలో 3.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో 2024 డిసెంబర్లో ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంపం తర్వాత మళ్లీ ఈ ప్రాంతంలో ప్రకంపనలు రావడం గమనార్హం. గోదావరి ఫాల్ట్ సిస్టమ్, ఇండియన్ ప్లేట్ కదలికల వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగానే ద్వీపకల్ప భారతదేశంలోని సీస్మిక్ జోన్-2 ప్రాంతంలో ఇలాంటి అరుదైన భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.